అష్టావక్ర మహర్షి
ఏకపాదుడనే బ్రాహ్మణుడు నిరంతర తపోనిధుడు. ఆయన
భార్య సుజాత ఉత్తమురాలు. ఏకపాదునికి ఎంతోమంది శిష్యులుండేవారు. బ్రహ్మచారులందరూ
ఆయన వద్దనే ఉండి విద్య నేర్చుకొనేవారు. భార్యాభర్తలిద్దరూ శిష్యులతో హాయిగా కాలం
గడుపుచున్నారు. సుజాత కొన్నిరోజులకు గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డ తండ్రి
వేదములు శిష్యులకు చెప్తూవుండగా తల్లిగర్భంలో వుండి వింటూ సర్వము తప్పు
నిద్రాహారములు లేకుండా శిష్యులతో చెప్పించటం తప్పు అని తండ్రికి తెలిపాడు.
తనకు పుట్టబోయే కుమారుడు దివ్య మణితుల్యుడు అని
గ్రహించి సంతోషించాడు. కాని పుట్టకుండానే తనను తప్పుపట్టాడు వక్రముగా ఆలోచించాడని,
ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు. సుజాత ఒక రోజున నెయ్యి, నూనె, ధాన్యం తెమ్మని
చెప్పగా వాటికోసం జనకమహారాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పందెం జరుగుచున్నది.
అదేమంటే
వరుణుని కుమారుడు వందితో వాదమున గెలిచినవారికి సర్వం యిస్తారని, ఓడితే జలములో మునిగి ఉండవలెనని చెప్పారు.
ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయాడు. జలాశయంలో ఉండిపోయాడు. సుజాత నెలలు నిండాక ఒక
కుమారుణ్ని కన్నది. ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నాడు. ఆ కారణంతో అష్టావక్రుడు అని
పేరు పెట్టారు. అదే సమయంలో సుజాత తల్లికి శ్వేతకేతు అనే పుత్రుడు పుట్టాడు.
అష్టావక్రుడు బాల్యం నుంచీ ఉద్దాలకమహర్షి వద్ద విద్య అధ్యయనం చేస్తున్నాడు. ఆయన
ఉద్దాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావించేవారు. కొన్నిరోజులకు అసలు విషయం
తెలుసుకొని జలములో ఉన్న తండ్రిని తీసుకురావాలని తల్లి ఆశీర్వాదము పొంది జనకమహారాజు
అస్థానమునకు వెళ్లగా ద్వారపాలకులు ఇతనిని వెళ్లనివ్వలేదు. అనేక శాస్త్ర విషయాలు
చెప్పగా దారి ఇచ్చి పంపారు. ఆయన జనకమహారాజు సమక్షంలో వందితో వాదిస్తానన్నాడు.
బాలుడవు నీవేమి వాదించలేవు అన్నా వినక పిలిపించమని పట్టుపట్టాడు.
వంది వచ్చాక వాదించి గెలిచి తన శక్తి
సామర్ధ్యములు తెలిపాడు. జనకమహారాజు అ బాలకుడ్ని అభినందించి “మహాజ్ఞానీ ఏమి కావాలో సెలవివ్వండి” అని పలుకగా తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుడ్ని
చేయమని కొరాడు. వంది తన తండ్రిని జలములో ఉంచలేదని తన తండ్రిని వరుణుడు చేయు యజ్ఞము
వద్దకు పంపాడని తెలిసి వందిని కీర్తించాడు. అష్టావక్రుని కీర్తి నలుదిశలా
వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనకమహారాజు సత్కరించాడు. అద్వైత వేదాంత
రహస్యములను అష్టావక్రుని ద్వారా తెలుసుకొని అతని పితృభక్తికి ఎంతో సంతోషించాడు.
తండ్రి కూడా మెచ్చుకొని నదియందు స్నానం చేయించి కుమారుని వంకరలు పోయేటట్లు చేశాడు.
అష్టావక్రుడు సుందరుడై ఇంటికి వచ్చి
తల్లిదండ్రులకి సేవచేస్తూ ఉండిపోయాడు.
వివాహ వయస్సు రాగానే వదాస్యమహర్షి కుమార్తె సుప్రభను ఇచ్చి
పెళ్ళి చేశారు. భార్యతో కలసి ఆశ్రమం నిర్మించుకొని తపస్సుచేస్తూ గృహస్థాశ్రమంలో
ఉండిపోయాడు.
ఒక రోజున అష్టావక్రుడు నదిలో స్నానం చేస్తుండగా
అప్సరసలు వచ్చి నృత్యగీతములని వినిపించారు. ఆయన సంతోషించి ఏం కావాలో
కోరుకోమన్నాడు. వాళ్లు మాకు విష్ణుమూర్తితో స్నేహం కావాలని కోరారు.
ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని దగ్గర గోపికలై జన్మించి స్నేహం
చేస్తారని వరం ఇచ్చాడు. తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి,
శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.
ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. ఈ
పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై
ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ
చదవదగినది.
No comments:
Post a Comment